శ్రీ శారదామాత జీవితచరిత్ర🌹 పార్ట్ 16
🌺శ్రీ మాత్రే నమః🌺
*_🌹శ్రీ శారదామాత జీవితచరిత్ర🌹_*
1⃣6⃣ *వ రోజు*
🌻🌻🌻🌻🌻🌻🌻
శారదామాత నహాబత్తులో గోప్యంగా ఎవరికంట పడకుండా జీవించారు.
ఇతరు లెవ్వరూ ఆమెను చూచి ఎరుగరు. 'భట్టాచార్య'(గురుదేవులు) భార్య ఇక్కడ వసిస్తున్నారని విన్నాం కానీ ఒక్క రోజు కూడా ఆమెను చూడలేదు' అంటూ ఆలయ సిబ్బంది చెప్పేటంత గోప్యంగా ఎవరికంటా పడకుండా ఆమె జీవించారు.
మాతృదేవి సరళత, మరుగుపరచుకుని జీవించే సహజ గుణం గురుదేవులకు ఎంతో నచ్చింది.
ఈ విషయంగా ఆయన హృదయ్ తో ఇలా అన్నారు:
'హృదూ! ఆమె ఇక్కడకు వచ్చినప్పుడు మొదట్లో నేను చాలా ఆందోళన చెందాను. గ్రామంలో పెరిగింది కదా! ఆమెకు పట్టణ అలవాట్లు ఏమీ తెలియవు కదా! ఆమె పల్లెటూరితనం కారణంగా ఎవరైనా ఆమెను హేళన చేస్తే మనకు ఆవేదనగా ఉండవచ్చు ననుకున్నాను. కానీ ఉన్న చోటే తెలియకుండా ఆమె ఎలా ఒద్దికగా జీవిస్తూన్నదో చూడు! స్నానం చేయడానికో మరెందుకోసమో ఆమె బయటికి వెళ్లడం నేను కూడా చూడలేదు" అన్నారు.
ఆ చిన్న గదిలో మాతృదేవి ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురుదేవులకు తెలియకపోలేదు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఆమె జీవించడానికి నహబత్తు తప్ప, దేవాలయంలో వేరే స్థలం లేకపోయింది.
చీకటిమయమైన ఆ చిన్న గదిలో రోజంతా గడిపితే మాతృదేవి ఆరోగ్యం దెబ్బతింటుందని గురుదేవులు ఎంతో కలత చెందారు. ఆయన భయపడినట్లే ఒకింత కాలం ఆమె ఆ గదిలో నివసించే లోపునే ఆమెకు వాతరోగం కమ్మింది.
కాలాంతరంలో మాతృదేవి ఇలా అన్నారు:
'గురుదేవుల గది సదా నామ సంకీర్తనం, దివ్యసంభాషణలు, పారవశ్య స్థితులతో ఆనందపూరితమై ఉండేది.
ఎందరెందరో భక్తులు వచ్చేవారు. వారి గదిలోని ఉత్తరపు వైపు తలుపు తెరచివుంటే ఆ గదిలో జరిగే సంకీర్తనాదులన్నీ కనబడేవి. అందుకు తగ్గట్లు తడికలలో ఒక చిన్న రంధ్రం ఉండేది. నేను నిలబడే ఆ రంధ్రం గుండా గురుదేవుల పారవశ్య స్థితిలో నృత్యం చేయడాన్ని, పాడడాన్ని చూసి ఆనందించే దాన్ని, ఇలా ప్రతిరోజూ గంటల కొద్దీ నిలబడి ఉండడం వలన ఈ వాతరోగం క్రమ్మింది. ఇలా నేను గంటల కొద్దీ నిలబడడం గురుదేవులకు కూడా తెలుసు.
ఇలా చాలాసేపు నిలబడి నా ఆరోగ్యం పాడుచేసుకోకూడదని, "అడవులలో విహరించే పక్షిని గూట్లో బంధించి ఉంచినట్లయితే, దానికి కూడా వాతరోగం కమ్ముకుంటుంది. అందువల్ల నువ్వు
అప్పుడప్పుడూ బయటికి వెళ్లి కాసేపు నడవడం మంచిది" అని నాతో అన్నారు."
మధ్యాహ్నం భోజనాలయ్యాక సామాన్యంగా అందరూ నిద్రపోయే సమయంలో, గురుదేవులు పంచవటికి వెళ్లి చుట్టు పక్కల జనసంచార ముందా అని చూచేవారు. ఎవరూ లేని సమయం చూసి సహబత్తుకు వచ్చి నన్ను పిలిచి, "పంచవటి వైపు ఎవ్వరూ లేరు. ఇప్పుడు అటువైపుగా వెళ్ళి కాసేపు నడిచి రా" అనేవారు. నేను బయటికెళ్లే వరకు నన్ను చూస్తూ తమ గది బయట నిలబడేవారు. నేను సహబత్తు వెనుకవైపు దారిలో వెళ్లి, రామలాల్ ఇంటికి దగ్గరలో వున్న ప్రాంతంలో పరిచయమున్న కొందరి ఇళ్లకు వెళ్లేదాన్ని వారితో కొంతసేపు
మాట్లాడే దాన్ని. సాయంత్రం అందరూ పూజ కోసం ఆలయానికి వెళ్లిపోతారు. పంచవటివద్దో, ఇతర చోట్లలోనో ఎవరూ ఉండరు. సరిగ్గా ఆ సమయం చూసుకుని నేను నహబత్తుకు తిరిగి వెళ్లిపోయేదాన్ని.
నహబత్తులో మాతృదేవితోపాటు గురుదేవుల అన్న కుమార్తెయైన లక్ష్మి కూడా ఉండేది. వీరిద్దరినీ గురుదేవులు *"గూటి చిలకలు"* అంటూ తమాషాగా చెప్పేవారు. కాళికాలయం నుండి ప్రసాదం వచ్చిన వెంటనే వారు రాంలాల్ తో కొద్దిగా పండ్లు తీసుకెళ్లి ఆ గూటి చిలకలకు ఇచ్చి రా" అని పంపేవారు.
🌻🌻🌻🌻🌻🌻🌻
🌸శ్రీ శారదామాత చరితామృతం🌸
🌻🌻🌻🌻🌻🌻🌻

Comments
Post a Comment