శ్రీశారదామాత జీవితచరిత్ర పార్ట్ 21

🌻🌻🌻🌻🌻🌻🌻

🌻ఓం నమో భగవతే రామకృష్ణాయ🌺
🌹శ్రీశారదామాత జీవితచరిత్ర🌹                2⃣1⃣ వ రోజు

🌻🌻🌻🌻🌻🌻🌻

గురుదేవులు (శ్రీరామకృష్ణులు) మనఃస్థితి ఒక బాలుడు పోలినదిగా ఉండేది. బిడ్డ, భగవంతుడు ఒక్కటే అని చెబుతారు కదా! అది ఆయన విషయంలో పూర్తిగా నిజం. బిడ్డ వంటి వారితో, భార్య అనే స్థితిలో కంటే, తల్లిగానే శారదాదేవి వ్యవహరించారు. బిడ్డను, అన్నం తినేటట్లు చేయడానికి 'చంద్రుడిని పట్టి ఇస్తాను' అంటూ వెనుకాడక అబద్ధం చెప్పే ఆ మాతృ హృదయంతోనే గురుదేవులను చూసుకొన్నారు.

మాతృదేవి ఇలా అన్నారు :

ప్రతిరోజూ ఆయనకు మూడు లేక నాలుగు లీటర్లు పాలు ఇవ్వడం మామూలు. అంచలంచెలుగా ఐదు లీటర్లు ఇవ్వసాగాను. దేవాలయ ఆవులను పితికే వ్యక్తి పాలు తెచ్చేవాడు. పాలను బాగా మరగబెట్టి పావు భాగానికి తగ్గించేసేదాన్ని. 'ఇవెన్ని పాలు?' అని గురుదేవులు అడిగితే, "అంత ఎక్కువగా ఏమీ లేదు. ఒకటి ఒకటిన్నర లీటరు" అని చెప్పేదాన్ని. బాగా మరగబెట్టినందువల్ల పైన పేరుకొన్న గట్టి మీగడను చూసి, "పాలు కాస్త ఎక్కువ ఉన్నట్లుంది" అనేవారు.

ఒకరోజు గోలాప్ మా నిజాన్ని చెప్పేసింది. అది వినగానే, “హా! నేను రోజూ ఇన్ని పాలు తాగుతున్నానా? అందుకే అజీర్ణం' అని చెబుతూ, 'ఎక్కడ ఆమెను పిలువు! ఆమెను పిలువు!" అంటూ అరిచారు. ఇది విని నేను ఆయన గదికి వెళ్లాను. పాలు విషయంగా గోలాప్ మా చెప్పిన దాన్ని నాతో చెప్పారు. నేను ఎంత పాలు తీసుకుంటున్నానో కచ్చితంగా చెప్పమన్నారు. అందుకు నేను, "ఇవన్నీ ఎందుకు? ఈ లెక్కలన్నీ ఎవరికి తెలుసు? మీరు పాలు తీసుకోవాలి అని మాత్రం నాకు తెలుసు. కానీ సేరు, అరసేరు లెక్కలన్నీ నాకు తెలియదు" అన్నాను. “ఇన్ని పాలు తాగితే నాకు ఎలా జీర్ణమవుతుంది? నాకు అజీర్ణం చేసి తప్పకుండా ఆరోగ్యం చెడిపోతుంది" అని అన్నారు. ఈ ఆలోచన ఆయన మనస్సులో మెదలవగానే, ఆయనకు నిజంగానే అజీర్ణం చేసింది.

“భోజనం విషయంలో చిన్న అబద్దమాడడం తప్పు కాదు. ఇలా చేసే ఆయనను ఆహారం తీసుకొనేటట్లు చేస్తున్నాను” అన్నాను నేను. ఎలాగో ఆయన వ్యాధి నయమై ఆరోగ్యం కుదుట పడింది.

ఒక మహాత్ముని అర్ధాంగికి, వారిపట్ల తనకున్న ప్రేమను, మర్యాదను వ్యక్తపరచడానికి, ఆ మహాత్ముడు ఎంచుకున్న లక్ష్యం నెరవేరడానికి పాటుపడడం తప్ప మరో ఉత్కృష్టమైన మార్గం ఏమి ఉంటుంది? శారదాదేవి ఈ స్వభావాన్ని వ్యక్తం చేసే ఒకటి సంఘటన పరికిద్దాం :

గురుదేవుల భక్తులలో లక్ష్మీనారాయణ అనే మార్వాడీ ఉండేవాడు. ఒకరోజు గురుదేవుల పరుపు మీద పరచబడిన గుడ్డ మలినంగా ఉండడం చూసి అతడు గురుదేవుల పేరిట పదివేల రూపాయలు బ్యాంకులో నిల్వచేసి తద్వారా వచ్చే వడ్డీని గురుదేవులు తమ ఖర్చులకు ఉపయోగించుకోవలసిందని
ప్రాథేయపడ్డాడు. మూర్తీభవించిన త్యాగమూర్తులైన గురుదేవులు ఈ  సలహాకు సుతరామా అంగీకరించలేదు. పదే పదే ఈ ఏర్పాటు గురించి తన వద్ద ప్రస్తావించవద్దని గట్టిగా చెప్పేశారు. ఆ భక్తుడు వదలకుండా మరీ ప్రాధేయపడ్డాడు. ఆతడి వేధింపు నుండి తప్పించుకోవడానికి, "నాకు ఆ డబ్బు అక్కరలేదు. బహుశా శారద ఇష్టపడితే తీసుకోవచ్చు. ఇందులో ఎలాంటి అభ్యంతరంలేదు" అని అన్నారు. కానీ మాతృదేవి త్యాగంతో మేళవించిన మనస్సు గురుదేవులకు ఏ విధంగానూ తీసిపోలేదు. ఆమె ఆ పైకాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తూ నేను తీసుకున్నా అది ఆయన సేవలకే ఉపయోగపడుతుంది కనుక అప్పుడు ఆయన తీసుకున్నట్లే కదా!" అని కచ్చితంగా చెప్పేశారు. మాతృదేవి అలా నిరాకరించడంతో గురుదేవులు ఎంతో సంతోషించారు.

ఇలా భర్తకు యుక్తమైన భార్యగా జీవించి తరించారు మాతృదేవి.

🌻🌻🌻🌻🌻🌻🌻

🌺శ్రీశారదామాత చరితామృతం🌺

🌻🌻🌻🌻🌻🌻🌻

Comments

Popular posts from this blog

శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 18

శారదామాత జీవితచరిత్ర🌹 Part 33

శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 32