శ్రీశారదామాత జీవితచరిత్ర Part 14
🌻ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ🌺
🌹శ్రీశారదామాత జీవితచరిత్ర🌹 1⃣4⃣ వ రోజు
ఆధ్యాత్మిక అనుభూతులు :
🌻🌻🌻🌻🌻🌻🌻
ఒక రోజు గురుదేవులు శారదను పిలిచి ఆకాశంలో చంద్రుణ్ణి చూపిస్తూ
"ఇదిగో చూడు, పిల్లలందరూ చంద్రుణ్ణి చందమామ అంటూ బంధుత్వం కలుపుతారు. ఆ చంద్రునిలాగా భగవంతుడు కూడా అందరికీ సొంతమైనవాడు. ఉత్సాహంతో పిలిచే వారికందరికీ ఆయన అనుగ్రహం లభిస్తుంది. నువ్వు కూడా నీ మనస్సును భగవంతుని వైపు మళ్లించి, నిండు మనస్సుతోనూ, బంధుత్వంతోనూ ఆయనను ప్రార్థించు. అప్పుడు ఆయనను పొందగలవు" అన్నారు.
మరొకరోజు రాత్రి, శారద గురుదేవులకు ఒక పళ్లెంలో ఆహారం తీసుకొని, మరొక భక్తురాలితో ఆయన గదిలోకి వెళ్లింది.
గురుదేవుల సమక్షంలో సైతం మేలిముసుగు ధరిస్తుంది శారద. అప్పుడు గురుదేవులు దివ్య పారవశ్య స్థితిలో ఉన్నారు. శారదని చూచి భగవద్విషయాలు గురించి చెప్పసాగారు. ఉన్నతమైన సత్యాలను చెప్పడంతో పాటు, వాటిని ఆలోచించి చూడమనేవారు గురుదేవులు.
“పశువులు పగటి వేళలో తిన్న ఆహారాన్ని రాత్రి నెమరు వేస్తాయి. మీరు కూడా నేను చెప్పిన విషయాలు మీలో మీరు చర్చించుకోవాలి. అప్పుడే వాటిని మరిచిపోరు” అన్నారు.
ఇలా ఉపదేశాలను,
సలహాలను ఇవ్వడంతోపాటు గురుదేవులు శారదకు మంత్రోపదేశం చేసి జపం, ధ్యానం ఇత్యాదులలో శిక్షణకూడా ఇచ్చారు. గురుదేవులు ఆమెకు శక్తి మంత్రం దీక్షను ప్రసాదిస్తూ, బీజ మంత్రాన్ని ఆమె నాలుకపై వ్రాశారు.
శారద వేకువజామున మూడు గంటలకులేచి ధ్యానంలో కూర్చునేది. గురుదేవులకూ, ఆయన భక్తులకూ రోజంతా చేయవలసిన సేవల నడుమ చాలాసేపు ఆమె జపంలోనూ, ధ్యానంలోనూ గడిపేది. "ప్రతి రోజూ ఒక లక్ష జపం చేయడానికి సమయాన్ని కేటాయించుకొనేదాన్ని” అంటూ కాలాంతరంలో చెప్పేవారు. వెండి వెన్నెల రాత్రులలో చంద్రుణ్ణి చూస్తూ, 'భగవంతుడా! చంద్రునిలా నా మనస్సు కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలి. చంద్రునిలో కూడా కొన్ని మచ్చలున్నాయి. నా మనసులో అవి కూడా ఉండకూడదు' అంటూ భగవంతుణ్ణి ప్రార్ధించేవారు.
రాజయోగంలో కూడా ఆమెకు తర్ఫీదు నిచ్చారు గురుదేవులు. మానవ శరీరంలోని ఆరు చక్రాలనూ, కుండలినీ శక్తి మొదలైన వాటిని చిత్రాలుగా గీసి ఆమెకు చెప్పేవారు.
రోగాలు నయం చేయడం లాంటి సిద్దుల వెంట ఆమె మనస్సు వెళ్లకూడదని ఎంతో జాగ్రత్త వహించారు గురుదేవులు. ఈ కాలఘట్టంలోనే పలుదేవతా మంత్రాలనూ, వాటిని ఇతరులకు ఇవ్వవలసిన విధానాన్ని గురుదేవులు శారదకు నేర్పించారు.
🌻🌻🌻🌻🌻🌻🌻
🌹శ్రీ శారదామాత చారితామృతం🌹
🌻🌻🌻🌻🌻🌻🌻

Comments
Post a Comment